మరుసటి యేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమ కూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను.
దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను.
దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి.
అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.
మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.
మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.
వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.
గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.